కామ్రేడ్ జక్కా వెంకయ్య 8వ వర్ధంతి సభలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
ఆత్మకూరు( హరికిరణ్,పున్నమి ప్రతినిధి)
ఆత్మకూరు పట్టణంలోని డాక్టర్ చెర్లో రమణారెడ్డి భవనం (సిపిఎం కార్యాలయం) నందు కామ్రేడ్ జక్కా వెంకయ్య 8వ వర్ధంతి సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం “మతము – వర్తమాన పరిస్థితులు” అనే అంశంపై ప్రసంగిస్తూ సమాజంలో పెరుగుతున్న మత విద్వేషాలు, సామాజిక విభేదాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అనేది భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు కలిసిన లౌకిక దేశమని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ప్రతి మతాన్ని గౌరవించాలని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం కొన్ని శక్తులు మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
మతం అనేది మనుషులను మంచిమార్గంలో నడిపించేందుకు ఉండాలని, ద్వేషాలను పెంచేందుకు కాదు అని ఆయన పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం కొనసాగాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి మానవత్వ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
కామ్రేడ్ జక్కా వెంకయ్య జీవితం ప్రజా సేవకు అంకితమైందని, పేదల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడారని విఠపు బాలసుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ సామాన్యుల కోసం పోరాడిన నాయకుడిగా జక్కా వెంకయ్య పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు.
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు వంటి అనేక కీలక అంశాలు ఉన్నప్పటికీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు అసలు సమస్యలను గుర్తించి ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో కామ్రేడ్ జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్మా రాజు మాట్లాడుతూ జక్కా వెంకయ్య ఆశయాలను కొనసాగించడం ద్వారా సమాజానికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.



