చిట్వేలి మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామిశెట్టి కుశాల్ జాతీయ స్థాయి ఇస్రో యువికా–2026 కార్యక్రమానికి ఎంపిక కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన “బడి పిలుస్తోంది” ప్రత్యేక నమోదు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎస్. కుమార్, సీఎంవో సురేష్, డిప్యూటీ డీఈఓ దేవరాజ్ రైల్వే కోడూరులో పర్యటించారు.
ఈ సందర్భంగా చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రామిశెట్టి కుశాల్తో పాటు గైడ్ టీచర్ ఏ. శివనారాయణ గౌడ్ను ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇస్రో యువికా కార్యశాలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఇప్పటికే సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్, సమగ్ర సైన్స్ మహోత్సవ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన కుశాల్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. దుర్గరాజు తెలిపారు.


