పున్నమి ప్రతినిధి తిరుచానూరు, 2026 ఏప్రిల్ 28
తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్లో ఉన్న శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో అన్నప్రసాద వితరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తూ భక్తులతో నేరుగా మాట్లాడారు. అన్నప్రసాదాల నాణ్యత, సమయపాలన, సేవల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, తాగునీరు, రాత్రి వరకు వితరణ సమయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. అనంతరం అన్నప్రసాద భవనంలోని స్టోర్రూమ్, కోల్డ్ స్టోరేజ్, వంటగది, పరిశుభ్రతను పరిశీలించి కూరగాయలు, ఆకుకూరల నిల్వలపై సమీక్షించారు.
అదేవిధంగా, ఉపయోగంలో లేని ఫర్నిచర్, పనికిరాని యంత్రాలు, ఇనుము వ్యర్థాలను త్వరితగతిన డిస్పోజ్ చేసేలా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సిబ్బందికి జీతభత్యాలు సకాలంలో అందుతున్నాయా, ఎలాంటి కోతలు ఉన్నాయా అనే అంశాలపై కూడా విచారణ జరిపారు.
ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, అన్నప్రసాద కేంద్రం అధికారి శ్రీ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
—————————–
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది







