వర్తించని జిఎస్టి – జిఎస్టి తగ్గినా తగ్గని మందుల ధరలు
– పాత స్టాక్ పేరిట పాత రేట్లకే అమ్మకాలు
– పట్టికలు లేక ప్రజలు అయోమయం
ప్రభుత్వం మందులపై జిఎస్టి రేట్లను తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రయోజనం అశ్వారావుపేట ప్రజలకు అందడం లేదు. మండల కేంద్రంలోని పలు మెడికల్ షాపులు ఇప్పటికీ పాత ధరలకే మందులు విక్రయిస్తున్నాయి. కొత్త జిఎస్టి రేట్లు అమలులోకి వచ్చాయంటూ వినియోగదారులు అడిగితే, ఇవి పాత స్టాక్ మందులు అని చెప్పి తప్పించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా పన్నులు తగ్గినా ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి తగ్గలేదు అని వినియోగదారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎక్కడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పన్ను తగ్గించిన ప్రయోజనం లేదు :
కేంద్ర ప్రభుత్వం ఇటీవల సాధారణ యాంటీబయోటిక్స్పై జిఎస్టి 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించగా, కొన్ని జీవరక్షక మందులపై పన్ను పూర్తిగా రద్దు చేసింది. దీంతో మందులు తక్కువ ధరలో అందాలని భావించిన ప్రజలు నిరాశ చెందుతున్నారు. స్థానిక వ్యాపారులు మాత్రం పాత ధరలకే విక్రయిస్తుండడంతో, ప్రభుత్వం చేసిన తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టికలు లేవు – పారదర్శకత ఎక్కడ? :
జిఎస్టి మారిన తర్వాత ప్రతి షాప్ తమ వద్ద పన్ను రేట్ల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే అశ్వారావుపేట కేంద్రంలోని చాలా మెడికల్ షాపుల్లో అలాంటి బోర్డులు కనిపించడం లేదు. పాత, కొత్త రేట్ల వివరాలు చూపించకపోవడం వినియోగదారులలో అనుమానాలను కలిగిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం :
ప్రభుత్వం పన్ను తగ్గించింది కానీ షాపులు మాత్రం మన జేబులు ఖాళీ చేస్తున్నాయి. అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ, ఆరోగ్య, వాణిజ్య పన్ను శాఖలు ఈ అంశంపై గమనించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సామాజిక సంస్థలు ఈ అక్రమాలను వెంటనే అరికట్టి, తగ్గించిన ధరల్లోనే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


