ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ చంద్రగ్రహణం :
ఆకాశంలోని అద్భుత ఖగోళ సంఘటనలకు ఆసక్తి కలిగిన వారికి ఇది విశేష శుభవార్త. రాబోయే నెలలో మన కళ్లముందు ఓ అరుదైన, మంత్ర ముగ్ధం చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సందర్భంగా చంద్రుడు సహజంగా కనిపించే వెలుగుతో కాకుండా, ఎర్రటి–నారింజ రంగులో ప్రకాశిస్తాడు. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా “బ్లడ్ మూన్” లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఈ విశేష దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు ఆకాశాన్ని అలరించనుంది.
ఈ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్లోని ప్రజలకు కూడా ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. వాతావరణం అనుకూలిస్తే, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ రక్త చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువసేపు, ఇంత విస్తృతంగా కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది – చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు? అసలు విషయం ఏమిటంటే, సూర్యుడు–భూమి–చంద్రుడు ఒకే సూటి గీతలో ఉన్నప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ పూర్తిగా చంద్రుడిపై పడుతుంది. అయితే సూర్యకాంతి భూమి వాతావరణం గుండా వెళ్తూ వంగి చంద్రుడిని చేరుతుంది. ఈ ప్రక్రియలో నీలి కాంతి వాతావరణంలో ఎక్కువగా చెదిరిపోతుంది. ఫలితంగా ఎరుపు, నారింజ రంగు కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడిని తాకుతాయి. అందువల్ల చంద్రుడు ఎర్రటి, నారింజ రంగు వెలుగుతో మెరిసిపోతాడు.
ఈ అరుదైన ఆకాశ దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియులు, శాస్త్రవేత్తలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


