ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ /పువ్వాడ నాగేంద్ర కుమార్ )
సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల కొనుగోలు, కేటాయింపులో జరిగిన అక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.
వైరా పోలీస్ ఇన్స్పెక్టర్ పి. రామారావు ఆధ్వర్యంలో పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రజాస్వామ్య హక్కుల హననమేనని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం తగదన్నారు.
బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, నాబార్డ్కు 30 శాతం వాటా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం 20 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూములను ఒక ప్రైవేటు సంస్థకు తక్కువ ధరకు కేటాయించే ప్రయత్నం చేయడం తీవ్ర అభ్యంతరకరమని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదులు, నివేదికలు సమర్పించినప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా అక్రమాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల వ్యవహారంపై వెంటనే స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపి అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అరెస్టు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల ఆస్తులను కాపాడేందుకు, రైతుల హక్కులను పరిరక్షించేందుకు బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల అక్రమాలపై భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని నంబూరి రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు.
అరెస్టైన వారిలో వైరా పట్టణ బీజేపీ అధ్యక్షుడు వెంకటకృష్ణ, వైరా రూరల్ మండల అధ్యక్షుడు దోసపాటి కళ్యాణ్రావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాయల కృష్ణారావు, శ్రీనునాయక్, టి. కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు.



