హిరోషిమా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక అవగాహన కార్యక్రమం
ఆత్మకూరు, ఆగస్టు 6 (పున్నమి ప్రతినిధి): శాస్త్ర విజ్ఞానాన్ని వినాశనానికి కాకుండా ప్రజా సంక్షేమానికి, దేశాభివృద్ధికి వినియోగించే దిశగా కృషి చేయాలని, ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ సుధాకర్ రెడ్డి అన్నారు.హిరోషిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించారు.
డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్, న్యూట్రాన్లు, అణుశక్తి, అణుబాంబులు, హీలియం వంటి శాస్త్రీయ అంశాలను వివరించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబుల దాడుల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం, తరతరాలపై పడిన తీవ్ర ప్రభావాలను వివరించి, యుద్ధాలు మానవాళికి ఎంతటి వినాశనాన్ని మిగులుస్తాయో విద్యార్థులకు తెలియజేశారు.శాస్త్ర విజ్ఞానాన్ని విధ్వంసానికి కాకుండా ప్రజా సంక్షేమానికి వినియోగించాలన్నారు. థర్మల్, జలవిద్యుత్తో పాటు అణు విద్యుత్ను అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఉత్పత్తి చేస్తే కాలుష్యాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సైన్సు అందించే అవకాశాలను సమాజాభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, జన విజ్ఞాన వేదిక నాయకులు కృష్ణప్రసాద్, సందాని షుకూర్, సాదిక్ హుస్సేన్, ప్రజానాట్య మండలి నాయకుడు గద్దర్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.


