బ్రేకింగ్ న్యూస్
పల్నాడు జిల్లా :-మాచర్ల
పల్నాడు జిల్లాలో దారుణం.. మాజీ జెడ్పీటీసీ కుమారుడు చెన్నారెడ్డి హత్య
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ నవులూరి భాస్కర్ రెడ్డి కుమారుడు నవులూరి చెన్నారెడ్డి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు.
గ్రామ సమీపంలో చెన్నారెడ్డిని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం.
సంఘటన స్థలంలో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దుండగులు కారం చల్లిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ధృవీకరణ ఇవ్వాల్సి ఉంది.
ఈ హత్య రాజకీయ కోణంలో జరిగిందా, లేక వ్యక్తిగత లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశాలపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే హత్య వెనుక అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
విషయం తెలిసిన వెంటనే పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు, రెంటచింతల ఎస్సై నాగార్జునతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలను వెలికితీసే పనిలో ఉన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రెంటాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా,
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.




