*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నంలో దొండపర్తి వద్ద ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో “చార్టర్డ్ ఇంజనీర్లు (వాల్యూయర్స్) – విశాఖపట్నం ఆర్థిక కారిడార్ సమావేశం” సందర్భంగా, ఇరవై సూత్రాల కార్యక్రమాలు (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్ర) అమలు చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇంజనీర్లు, వాల్యూయర్స్ దేశ ఆర్థిక బలానికి కాపలాదారులు. ప్రతి ప్రాజెక్ట్, ప్రతి ఆస్తి, ప్రతి పెట్టుబడి వెనుక మీ సంతకం, మీ నైపుణ్యం, మీ భరోసా ఉంది. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి కేంద్రంగా ఎదుగుతున్న ఈ సమయంలో, మీ భాగస్వామ్యం అత్యంత కీలకం” అని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ @2047 సాధనలో ఇంజనీర్ల పాత్ర నిర్ణాయకమని హితవు పలికిన ఆయన—
“ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ సంకల్పంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి 40% వాటా విశాఖపట్నం ప్రాంతానిదే. ఈ అభివృద్ధి యాత్ర మీ నైపుణ్యం లేక పూర్తికాదు” అన్నారు.
భవిష్యత్ సాంకేతికతల ప్రాముఖ్యతను వృద్ధి చేస్తూ—
“AI, GIS మ్యాపింగ్, డ్రోన్ ఇన్స్పెక్షన్స్, డిజిటల్ ట్విన్స్, 3D మోడలింగ్ — ఇవి రేపటి సాధనాలు కాదు, ఇవే నేటి అవకాశాలు. సాంకేతికతను సద్వినియోగం చేసే నైతికత కలిగి నిపుణులే నిజమైన అభివృద్ధిని నిర్మిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం పరిశ్రమలు, ఇన్నోవేషన్, లాజిస్టిక్స్, ఫార్మా, ఎనర్జీ, డిఫెన్స్ మరియు బ్లూ ఎకానమీ కేంద్రంగా ఎదుగుతున్నందున—
“ఇంజనీర్లు వాల్యూయేషన్ వ్యవస్థలో నైతికతకు ఆదర్శంగా, యువ ఇంజనీర్లకు మార్గదర్శకులుగా, ప్రభుత్వం–పరిశ్రమలతో విశ్వసనీయ భాగస్వాములుగా పనిచేయాలి. మీ ప్రతిభ ఈ ప్రాంత అభివృద్ధికి ఇంధనం కావాలి” అని లంకా దినకర్ పిలుపునిచ్చారు.
“స్వర్ణ ఆంధ్రకు భారతదేశాన్ని ప్రేరేపించే శక్తి, వికసిత్ భారత్కు ప్రపంచాన్ని ప్రేరేపించే శక్తి ఇవ్వాలి. మన నైపుణ్యం, మన దక్షత, మన నిబద్ధతతో ఈ లక్ష్యాలను చేరుకోవాలి” అని ఆయన ప్రతిజ్ఞకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్ ఛైర్మన్ కేవీ రామమోహనరావు, సెక్రటరీ చల్లా సురేష్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజనల్ మేనేజర్ రవికుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


