వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: సీఐ గంగాధర్
ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆత్మకూరు పోలీసు వలయ ఇన్స్పెక్టర్ జి.గంగాధర్ ప్రజలకు సూచించారు. పోలీసు వలయ పరిధిలోని ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక విగ్రహాల ఏర్పాటుకు ముందుగా సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటు వల్ల ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.విగ్రహం నిమజ్జనానికి తరలించే వరకు మండపాల వద్ద నిర్వాహకుల్లో ఎవరైనా అందుబాటులో ఉండాలని తెలిపారు. మండపాల వద్ద, నిమజ్జన సమయంలో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే డీజేలను వినియోగించరాదని స్పష్టం చేశారు. ఎలాంటి గొడవలు, వివాదాలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని కోరారు. భక్తిపారవశ్యంతో, సోదరభావంతో ప్రశాంతంగా పండుగను నిర్వహించుకోవాలని సీఐ గంగాధర్ విజ్ఞప్తి చేశారు.


