పుల్లంపేట మండలం అప్పరాజుపేట గ్రామంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు “మీ భద్రత – మా బాధ్యత” అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది మహిళలు పాల్గొన్నారు.
పుల్లంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, మండల అధికారుల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు రూరల్ సీఐ, డిప్యూటీ ఎంపీడీఓ, పుల్లంపేట ఎస్ఐ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, చైన్ స్నాచింగ్, ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
అలాగే కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యలు, కుటుంబ విభజనలకు దారితీసే పరిస్థితులపై చర్చిస్తూ, పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి విలువలు అందించడం ద్వారా వారి భవిష్యత్తును బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని, మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.


