మధిర /ఖమ్మం
మధిర పట్టణ అభివృద్ధి పేరుతో రైతుల పొలాలకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం చేపట్టవద్దని బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజు అన్నారు. మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు అవసరమో ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల జీవితాలను దెబ్బతీయకుండా, వారి జీవనోపాధికి రక్షణ కల్పించాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో మధిర పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని పేర్కొన్న కమల్ రాజు, 2007లో ఎమ్మెల్సీగా ఉన్న భట్టి విక్రమార్క ఇప్పటివరకు మధిర కోసం ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి మధిర ప్రజల కోసమా, భట్టి విక్రమార్క కుటుంబ అభివృద్ధి కోసమా అని నిలదీశారు. మధిరకు ఉన్న పేరును చెడగొట్టవద్దని, అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. రైతుల పొలాలకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని లింగాల కమల్ రాజు స్పష్టం చేశారు


