విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న
ఆత్మకూరు, జూలై 30 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలోని అరుంధతివాడ యూపీహెచ్సీ పరిధిలో ఉన్న బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ను గురువారం వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆరోగ్య అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో అందిస్తున్న ఆహారం నాణ్యత, భోజన సౌకర్యాలు, పోషకాహారం తీసుకోవడంపై కూడా వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని డాక్టర్ సాయి ప్రసన్న తెలిపారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని విద్యార్థినులకు సూచించారు.
డెంగ్యూ నివారణపై ప్రత్యేక అవగాహన
డెంగ్యూ నివారణ మాసోత్సవాల సందర్భంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, టి. శ్రీరాములు విద్యార్థినులకు డెంగ్యూ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
డెంగ్యూ దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కావడంతో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, హాస్టల్ ఆవరణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెత్త పేరుకుపోకుండా చూడడం, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను తొలగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.
జ్వరం, తీవ్రమైన ఒంటి నొప్పులు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి లేదా సమీప వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. జ్వరం వచ్చినప్పుడు స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా మేరకే చికిత్స తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సునీత, ఏఎన్ఎం నూర్జహాన్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


