పినపాక: మండలంలోని బయ్యారం గ్రామానికి చెందిన నవతెలంగాణ రిపోర్టర్ శ్రీరామ్ బృహస్పతి కుమారుడు నివేదన్ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. నీట్ ర్యాంకు ఆధారంగా పటాన్చెరువులోని మహేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు ఎంపికయ్యాడు.
చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి, పట్టుదలతో కృషి చేసిన నివేదన్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభ కనబరచడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. బయ్యారం గ్రామానికి చెందిన విద్యార్థి వైద్య విద్యలో ప్రవేశం పొందడం గ్రామానికి గర్వకారణమని పలువురు అభినందించారు.
నివేదన్ విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో పాటు అతని నిరంతర కృషి ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.



