రాజన్న సిరిసిల్ల జులై 22 ( పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల: జీవో నెం.25ను సవరించి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మండల కేంద్రంలోని వెంకంపేట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను వినిపించారు.
20 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఇద్దరు, 21–40 మంది విద్యార్థులకు ముగ్గురు, 41–60 మంది విద్యార్థులకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, 60 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడితో పాటు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, 80 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయుడిని కూడా కేటాయించేలా జీవో-25ను సవరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.


