ఖమ్మం పోలీస్ కవాతు మైదానంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయం కవాతు మైదానానికి చేరుకున్న భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ దివాకర్ TS, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల నుంచి భట్టి విక్రమార్క గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చేలా ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నామని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసిందన్నారు. మహనీయుల ఆశయాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదనపు DCP రామానుజం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలతో పాటు పోలీస్, హోంగార్డు, మినిస్టీరియల్ స్టాఫ్ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.



