కార్మికుల సమస్యల పరిష్కారమే భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ప్రధాన లక్ష్యమని BMS ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోరెంట్ల నారాయణ, యార్లగడ్డ రాఘవరావు అన్నారు. డిమాండ్స్ డే సందర్భంగా ఖమ్మం నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద BMS ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించారు.
కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.30 వేలకు, ESIC పరిమితిని రూ.42 వేలకు, EPF పరిమితిని రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. బోనస్ వేతన పరిమితుల పెంపు, కనీస పెన్షన్ రూ.7,500తో పాటు DA, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక హక్కులకు రక్షణ కల్పించేలా లేబర్ కోడ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ పరిమితిని రూ.40 లక్షలకు పెంచడంతో పాటు బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరారు.
కార్మికులకు సామాజిక భద్రత, మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని నారాయణ, రాఘవరావు కోరారు. “దేశ హితం–పరిశ్రమ హితం–కార్మిక హితం” లక్ష్యంతో ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోడుపునూరి రవీందర్, రాయల సీతయ్య, తోట పున్నారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ రావు, జాయింట్ సెక్రటరీలు కామని వెంకటేశ్వర రావు, మిక్కిలినేని సునీల్, కార్తీక్, మాధవి, నరేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


