డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేసిన గ్రామ యువకులు – మద్దతుగా సీపీఎం నాయకులు
ఆత్మకూరు, జూన్ 9 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మండలంలోని చివరి గ్రామమైన ఎర్రబెల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ యువకులు ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శివకేష్ యాదవ్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీపీఎం పార్టీ ఆత్మకూరు పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు మద్దతుతో యువకులు డిపో కార్యాలయాన్ని సందర్శించి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను వివరించారు.
ప్రస్తుతం బొటికెర్లపాడు వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సును ఎర్రబెల్లి గ్రామం వరకు పొడిగించాలని వారు కోరారు. ఎర్రబెల్లి గ్రామం మండలంలోని మారుమూల ప్రాంతంలో ఉండటంతో ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు రవాణా సౌకర్యాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లేందుకు, గ్రామ ప్రజలు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర అవసరాల కోసం ఆత్మకూరుకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.బస్సు సౌకర్యం కల్పిస్తే గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, విద్యార్థుల విద్యాభ్యాసానికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకమని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన డిపో మేనేజర్ శివకేష్ యాదవ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామ యువకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు మరియు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.


