ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ప్రజలందరిపై అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం జరగనున్న పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ మానవత్వం, దాతృత్వం, విశ్వాసం వంటి గొప్ప విలువలను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తుందని విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. దేవునిపై పూర్తి విశ్వాసంతో సన్మార్గంలో జీవిస్తే ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని అన్నారు. ఈద్ అల్ అదా పండుగ మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పెంపొందించడమే కాకుండా, పరస్పర సహకారం, సోదరభావాన్ని కూడా బలపరుస్తుందని తెలిపారు.తమకు ఉన్నదాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచిపెట్టే దాతృత్వ స్ఫూర్తిని బక్రీద్ కలుగజేస్తుందని ఆయన వివరించారు. పేదవారికి సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడం, సమాజంలో పరస్పర గౌరవ భావనతో జీవించడం వంటి మంచి లక్షణాలను ఈ పండుగ ప్రజల్లో పెంపొందిస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సమాజంలో మత సామరస్యం మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. యువత మంచి మార్గంలో నడిచి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని, అల్లాహ్ కరుణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆకాంక్షించారు.

