అప్పనపల్లి జెడ్పీ హైస్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖాజీపేట, ఆగస్టు 15: ఖాజీపేట మండలం అప్పనపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, విద్యార్థుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో SPIC రీజినల్ మేనేజర్ రమణారెడ్డి పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు చదువులో మరింత రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు స్వీట్లు కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, SPIC ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


