కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ, బీసీ, బహుజన, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులకు భంగం కలిగిస్తున్న ‘రెడ్డి జాగృతి’ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ సంస్థను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్.హెచ్ఓ నరేష్ కు పార్టీ ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్ మాట్లాడుతూ కుల సంఘం ముసుగులో పనిచేస్తున్న ‘రెడ్డి జాగృతి’ సంస్థ సమాజంలో అశాంతిని సృష్టిస్తోందని ఆరోపించారు. బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులను కాలరాస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. సమాజంలో ద్వేషాన్ని పెంచి పోషిస్తున్న ఈ సంస్థ ప్రతినిధులపై భారతీయ న్యాయ సంహిత (బీ ఎన్ ఎస్) సెక్షన్లు 196, 197, 353, 61 తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అలాగే, ఈ సంస్థ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా బ్యాన్ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ కాంపెల్లి స్వామి, పెద్దపల్లి మండల అధ్యక్షుడు వెంగళ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల ప్రశాంత్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


