రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, జీవో నెం.396ను రద్దు చేయాలని చిట్వేలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని దస్తావేజుల లేఖరులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిట్వేలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు పరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దీనివల్ల ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, కీలకమైన భూ రికార్డుల భద్రతపై సందేహాలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. తరతరాలుగా కొనసాగుతున్న దస్తావేజుల లేఖరుల వ్యవస్థకు జీవో నెం.396 ప్రమాదకరమని పేర్కొన్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని చేసిన ప్రయత్నాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అదే తరహా నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నిరసనలో సంఘం నాయకులు సమ్మెట వీరాంజనేయులు రాజు, పిడుగు సుబ్బరాయుడు, తొంబరపు వెంకటేశ్వర్లు, శివశంకర్, మురళి, ప్రసాద్ పిడుగు, నజీర్, వంశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:




