తాళ్లపూడి, జూలై 11 (పున్నమి ప్రతినిధి): కొవ్వూరు మాజీ శాసనసభ సభ్యులు, రాష్ట్ర కాపు నాడు మాజీ అధ్యక్షులు, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు జి.ఎస్.రావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కొవ్వూరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, ఉన్నత విలువలు, నిరాడంబర జీవనశైలితో రాజకీయ అజాతశత్రువుగా గుర్తింపు పొందిన జి.ఎస్.రావు సేవలను పలువురు నాయకులు, అభిమానులు స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే ఆయన వ్యక్తిత్వం చిరస్మరణీయమని, ఆయన మరణం ప్రజలకు, రాజకీయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన స్వగ్రామమైన పెద్దేవంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జి.ఎస్.రావు మృతిపట్ల కొమ్మిరెడ్డి పరశురామారావు, వంబోలు పోసిబాబు, బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, కుంటముక్కల కేశవ నారాయణ, కరిబండి గనిరాజు, నామా ప్రకాశం, కొసన శివ, బొయిదాపు రాజ్కుమార్, బండ్రెడ్డి సత్యనారాయణ, వల్లభశెట్టి శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


