దుమ్ము నివారణకు రోజుకు మూడు పూటలా నీటి జల్లింపు
ఆత్మకూరు, ఆగస్టు 6 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలో సెయింట్ మేరీస్ హైస్కూల్ నుంచి సోమశిల రోడ్ సెంటర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో భారీగా దుమ్ము ఎగిసిపడుతూ పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము కారణంగా ప్రజలు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై గురువారం “కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడినట్టుంది ఆత్మకూరు ప్రజల పరిస్థితి..!” అనే శీర్షికతో పున్నమి దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. ఇదే అంశంపై సీపీఎం నాయకులు మాస్కులు పంపిణీ చేస్తూ వినూత్నంగా నిరసన చేపట్టడంతో పాటు ప్రజాసంఘాలు కూడా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాయి.
వార్తా కథనాలు, ప్రజల నిరసనలు, ప్రజాసంఘాల విజ్ఞప్తుల నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించారు. గురువారం నుంచే రోడ్డుపై దుమ్ము తగ్గించేందుకు రోజుకు మూడు పూటలా నీటిని జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో రహదారిపై దుమ్ము కొంత మేర అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
అయితే ఇది తాత్కాలిక పరిష్కారమేనని, శాశ్వత పరిష్కారం కోసం రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి దుమ్ము సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


