రాష్ట్రవ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
పిల్లల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : సరండి గ్రామ పటేల్ కొట్రాంగే మేంఘజి
వాంకిడి, జూలై 14: పిల్లల్లో నులి పురుగుల సమస్యను నివారించి, వారి శారీరక, మానసిక ఎదుగుదలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన బాలబాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా వాంకిడి మండలం సరండి గ్రామ పటేల్ కొట్రాంగే మేంఘజి మాట్లాడుతూ, పిల్లల్లో నులి పురుగుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత, పోషకాహార లోపం, బరువు తగ్గడం, శారీరక ఎదుగుదల మందగించడం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆల్బెండజోల్ మాత్రలు శాస్త్రీయంగా పరీక్షించబడిన సురక్షితమైన ఔషధాలని, వైద్యుల సూచనల మేరకు ఉచితంగా పంపిణీ చేస్తున్నందున తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు లేకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలని కోరారు. పిల్లల ఆరోగ్య రక్షణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా సిబ్బంది, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమన్వయంతో గ్రామాల వారీగా పిల్లలను గుర్తించి మాత్రలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పాఠశాలకు హాజరుకాని పిల్లలను కూడా ఇంటింటికి వెళ్లి గుర్తించి ఆల్బెండజోల్ మాత్రలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
పిల్లలు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మరుగుదొడ్లను వినియోగించడం, గోర్లు శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన తాగునీటిని వినియోగించడం వంటి అలవాట్లు అలవరచుకుంటే నులి పురుగుల సమస్యను మరింత సమర్థవంతంగా నివారించవచ్చని సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని, ప్రజల సహకారంతో పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించవచ్చని కొట్రాంగే మేంఘజి పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని, ప్రతి అర్హత కలిగిన బాలబాలిక ఆల్బెండజోల్ మాత్రను తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


