మధిర/ఎర్రుపాలెం, జూలై
(పున్నమి న్యూస్)
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన 14 సీసీ రోడ్లను బుధవారం ఆయన ప్రారంభించారు.
మధిర మండలం మాటూరు గ్రామం నుంచి ప్రారంభమైన ఈ పర్యటన ఎర్రుపాలెం మండలంలోని రామన్నపాలెం, ఇనగాలి, తక్కెళ్లపాడు, బనిగండ్లపాడు, మీనవోలు, ఎర్రుపాలెం మండల కేంద్రం, రేమిడిచర్ల గ్రామాల వరకు కొనసాగింది. ప్రతి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీ, తక్కెళ్లపాడు గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు గ్రామ ప్రజల రాకపోకలను సులభతరం చేసి, వారి ఇబ్బందులను శాశ్వతంగా తొలగిస్తాయని చెప్పారు.
ఎంపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ కోటా రాంబాబు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మాజీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మదన్మోహన్ రెడ్డి, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


