ఆత్మకూరు, జూలై 23 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుపై అక్రమ మట్టి తరలింపుదారులు దాడికి పాల్పడడం అత్యంత దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు సోమా వెంకటసుబ్బయ్య, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవ్ మూర్తి తీవ్రంగా ఖండించారు.
గ్రామస్తుల సమాచారం మేరకు గురువారం నెల్లూరుపాలెం పరిసర ప్రాంతంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం అందడంతో పలువురు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. రాజ్ న్యూస్ జర్నలిస్టు సురేష్ ఘటనను వీడియో రూపంలో చిత్రీకరిస్తుండగా అక్రమ మట్టి తరలింపుదారులు ఆయనను అడ్డుకుని మొబైల్ ఫోన్ లాక్కొని భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుపై దాడి చేయడం, విధులకు ఆటంకం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడితో సమానమని వారు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ప్రింట్, ఎలక్ట్రానిక్, యూట్యూబ్ మీడియా ప్రతినిధులు స్థానిక సీఐ గంగాధర్ కు ఫిర్యాదు చేసి నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు పూర్తి రక్షణ కల్పించి, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టులు నిర్భయంగా విధులు నిర్వహించే వాతావరణాన్ని ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.


