బిక్కవోలు, ఆగస్టు 2 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): రైతు బజార్లు, రైస్ మిల్లుల ఔట్లెట్ల వద్ద తక్కువ ధరకే బియ్యం విక్రయాలను ప్రభుత్వం ప్రారంభించింది. బిక్కవోలు మండలం తొస్సిపూడిలోని సాయి తేజ రైస్ మిల్ ఔట్లెట్ వద్ద రా రైస్ కిలో రూ.50, స్టీమ్ రైస్ కిలో రూ.52 చొప్పున రేషన్ కార్డుకు 26 కిలోల పరిమితితో విక్రయాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో రైస్ మిల్ యాజమాన్యం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



