పున్నమి ప్రతినిధి, తిరుపతి, కల్చరల్ – జూలై 23
తిరుపతి మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన హనుమ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది.
అభివృద్ధి పేరుతో గిరిజన జీవనంలో వచ్చిన మార్పులు, తరాల మధ్య తెగిపోతున్న అనుబంధాలను కళ్లకు కట్టినట్లు ఈ నాటిక చూపింది. విశాఖపట్టణానికి చెందిన తెలుగు కళా సమితి ఈ నాటికను ప్రదర్శించింది. ప్రముఖ రచయిత శ్రీ అబ్బాద అప్పలనాయుడు రచన, శ్రీ చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వం, శ్రీ వై.ఎస్.కె.ఎస్. స్వామి నిర్మాణంలో ఈ నాటిక రూపుదిద్దుకుంది.
రెండు కొండల మధ్య పారే సెలయేరు ఆధారంగా జీవిస్తున్న గిరిజన గూడెంలో సోమన్న కుటుంబం ఒకటి. పెద్దలు చూపిన ‘చిటికెన వేలు’ పట్టుకుని వారి అడుగుజాడల్లో నడవడమే ఆనాటి తరం నైజం. సోమన్న కూడా అలాగే పెరిగి తన కుమారుడు ‘రంజిం’కు అదే బాట చూపాడు.
కాలక్రమంలో పరిస్థితులు మారాయి. రంజిం ఉద్యమంలోకి వెళ్లి, తన తండ్రి ఇచ్చిన ‘చిటికెన వేలు’ను తన కుమారుడు ‘బుధు’డికి అందించి అడవులకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత గూడెంలోకి నాగరికత, అభివృద్ధి ప్రవేశించాయి. ఆఫీసులు, రోడ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. సెలయేరు స్థానంలో జలాశయం ఏర్పడింది. అభివృద్ధి పేరుతో సోమన్నకు ఉన్న కొద్దిపాటి భూమి కూడా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయింది.
కొత్త తరానికి చెందిన బుధుడు తాత చూపిన విలువలను వదిలేసి ఆధునిక బాట పట్టాడు. ఫలితంగా సోమన్న ఒంటరివాడిగా మిగిలిపోయి, చివరికి తన భూమి హక్కులతో పాటు ‘చిటికెన వేలు’ను కూడా వ్యవస్థకు అప్పగించాల్సి వచ్చింది.
గిరిజన జీవనంపై ఆధునికత చూపిన ప్రభావాన్ని, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను ఈ నాటిక స్పష్టంగా చూపడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది
సోమన్న: శ్రీ డి. రమణమూర్తి
భార్య: శ్రీమతి డి. హేమవెంకటేశ్వరి
దర్శకత్వం: శ్రీ చలసాని కృష్ణప్రసాద్ సంగీతం: శ్రీ పి. లీలామోహన్





