పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
22 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా
హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక” కింద సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా, అన్ని ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతుల కోసం 3వ రోజును పాటించడం జరిగింది. దీని ప్రకారం, అన్ని సంస్థలు తనిఖీలు నిర్వహించి, హాస్టళ్లలోని భవనాలు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ పరికరాలు, వంటగది, టాయిలెట్ బ్లాక్లు, స్నానాల గదులు మరియు ఇతర ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన చిన్నపాటి మరమ్మతుల అవసరాలను గుర్తించాయి. ఈ పనులను నమోదు చేసి, అమలు చేయడానికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ భవనాల విషయంలో, అవసరమైన అంచనాలను సిద్ధం చేసి ఆమోదం కోసం సమర్పించడం జరుగుతోంది మరియు ఈ పనులను వేసవి సెలవుల సమయంలో చేపట్టడం జరుగుతుంది. ప్రైవేట్ భవనాల విషయంలో, 24.04.2026 నుండి అవసరమైన మరమ్మతు పనులను చేపట్టేందుకు భవన యజమానులతో సమన్వయం చేసుకోవాలని సూచనలు జారీ చేయబడ్డాయి. విద్యార్థులకు మరియు విద్యా కార్యకలాపాలకు కనీస అసౌకర్యం మరియు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, అన్ని మరమ్మతు పనులను వేసవి సెలవుల్లోనే పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది. “హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులు” అనే 3వ రోజు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఆయా హాస్టళ్లు/రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల ఇబ్బందులను నివారించేందుకు, మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చిన్నపాటి మరమ్మతు పనులను సకాలంలో చేపట్టేందుకు చర్యలు ప్రారంభించబడ్డాయి..
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) కె.శ్రీనివాస్ తో కలిసి మహేశ్వరం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు.
సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలపై సత్వరమే నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మహేశ్వరం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) కె.శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలలో వసతి గృహాలలో నెలకొన్న సమస్యలతో పాటు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలలో రిపేర్లను గుర్తించి నివేదికను సిద్ధం చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. రిపేర్ల కోసం నివేదికను అందించాలని తెలిపారు.గతంలో కంటే ప్రస్తుతం వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో వసతి గృహాలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం వంటశాల, పాఠశాలలోని వంటగది, మెస్ మరియు పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల నుంచి ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల నందు ఎంసెట్ పరీక్షలు వ్రాసేందుకు సిద్దమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని, విద్యార్థులు ఉన్నతస్థాయి చేరుకునేలా మీరంతా విద్యను బోధించాలని, మీ విద్యార్థులు ఉన్నతస్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మీరు ఉత్తమ పౌరులుగా, ఉన్నతస్థాయిలో ఉండే విధంగా, ఉపాధ్యాయునిగా తృప్తి చెందేలా బోధన చేయాలని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా ఉత్తమమైనదని, రాబోయో తరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే వృత్తిలో ఉన్నందున మంచి బోధనను అందించాలని, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి కేషు రామ్, తహశీల్దార్, మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




