“అవయవదానం – మరొకరికి జీవం పోసే మహాదానం”
జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా తిరుపతిలో అమర హాస్పిటల్ ఆధ్వర్యంలో 5కే రన్
తిరుపతి ఆగస్టు3
యువతరం న్యూస్:
జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమర హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 5కే రన్ విజయవంతంగా జరిగింది. అవయవదానంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమర హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శివ పార్వతి మాట్లాడుతూ, దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోందని, మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా అనేక మంది జీవితాలకు కొత్త వెలుగు ప్రసాదించవచ్చని తెలిపారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అమర్ రాజా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విశ్వనాథ సుధాకర్ తన ప్రసంగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆరోగ్యవంతమైన శరీరంతో పాటు మానవత్వంతో కూడిన మనసు కూడా ప్రతి ఒక్కరికీ ఉండాలని పేర్కొన్నారు. అవయవదానం అనేది మరణానంతరం కూడా పలువురి జీవితాల్లో ఆశాజ్యోతి వెలిగించే అత్యున్నత సేవ అని చెప్పారు. ఒకరి అవయవదానం పలువురికి పునర్జన్మను అందించే అవకాశం కల్పిస్తుందని, ఈ గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అవయవదానం ద్వారా మనిషి తన జీవితానికంటే గొప్ప సేవ చేసి సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాడని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో డాక్టర్ రాధిక, రోటరీ క్లబ్ ప్రతినిధులు, జయ రాంప్రసాద్, ఫన్షనర్స్ అసోసియేషన్, శంకర్, టీచర్స్ జేఏసీ, గోపాల్, కల్చరల్ చందులాల్ తదితరులు పాల్గొని అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఉద్యోగులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ 5కే రన్ ద్వారా “అవయవదానం అంటే ప్రాణదానం – మానవత్వానికి చిరస్మరణీయ నిదర్శనం” అనే సందేశం సమాజానికి బలంగా చేరింది.

