ఉత్తరక్రియల కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
ఆత్మకూరు , జూలై 16 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పడమటిపాలెం సాగునీటి సంఘం (సొసైటీ) అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గంగపట్నం చంద్రశేఖరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, గురువారం సంగం మండలం జంగాలకండ్రిగ గ్రామంలో నిర్వహించిన ఉత్తరక్రియల కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గంగపట్నం చంద్రశేఖరయ్య చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆనం కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చంద్రశేఖరయ్య మృతి తనను వ్యక్తిగతంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ఆకాంక్షించారు.చంద్రశేఖరయ్య ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని, పార్టీ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారని మంత్రి కొనియాడారు. ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని గంగపట్నం చంద్రశేఖరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.


