ప్రతి నెలా నిత్యావసర సరుకులు అందజేయనున్న డా. వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్
ఆత్మకూరు, జూన్ 8 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మున్సిపాలిటీ 17వ వార్డుకు చెందిన కొమరగిరి రమణమ్మ అనే నిరుపేద వికలాంగురాలికి డా. వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తనను పోషించే వారు లేక నిస్సహాయ స్థితిలో జీవనం సాగిస్తున్న రమణమ్మ పరిస్థితిని తెలుసుకున్న ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ స్పందించి ఆమెకు సహాయం అందించారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్, రమణమ్మకు భరోసా కల్పిస్తూ ట్రస్ట్ ద్వారా నిరంతర సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి నెలా ఆమెకు అవసరమైన నిత్యావసర సరుకులను అందజేయాలని ట్రస్ట్ సభ్యులను ఆదేశించారు.ఆదేశాల మేరకు సోమవారం ట్రస్ట్ సభ్యులు రమణమ్మ నివాసానికి వెళ్లి బియ్యం, కిరాణా సరుకులు తదితర నిత్యావసర వస్తువులను అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆమెకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేదలు, వికలాంగులు, వృద్ధులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. అవసరంలో ఉన్న వారికి చేయూత అందించడం ద్వారా మానవత్వాన్ని చాటవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ మార్గదర్శకత్వంలో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.సహాయం అందుకున్న రమణమ్మ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్కు, ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన పరిస్థితిని గుర్తించి ఆదుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ సహాయం తన జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను స్థానికులు అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.


