అనపర్తి, జూలై 24 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో–396ను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల చేపట్టిన “పెన్ డౌన్” ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు స్పష్టం చేశారు.
శుక్రవారం రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ జి.బి.ఆర్. అంబేద్కర్, ఐఏఎస్. రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీవో–396కు సంబంధించిన పలు అంశాలపై చర్చించినప్పటికీ, ఆ చర్చలు తనకు సంతృప్తికరంగా లేవని పెనుమాక వెంకట సుబ్బారావు తెలిపారు.
అంతేకాకుండా, సమావేశంలో మిగిలిన నాయకులు తనకు సహకరించకపోవడంతోనే అయిష్టంగానే ప్రకటనపై సంతకం చేయాల్సి వచ్చిందని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం జీవో–396ను ఉపసంహరించుకునే వరకు లేదా దస్తావేజు లేఖరుల సమస్యలకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా “పెన్ డౌన్” ఉద్యమాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయన పిలుపు మేరకు అనపర్తి–బిక్కవోలు సబ్ డివిజన్ పరిధిలోని దస్తావేజు లేఖరులు కూడా తమ “పెన్ డౌన్” నిరసనను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జీవో–396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, దస్తావేజు లేఖరుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.



