తాళ్లపూడి, జూలై 10 (పున్నమి ప్రతినిధి):
భారత అండర్-18 వాలీబాల్ జట్టుకు వేములూరి కార్తీక్ ఎంపిక
తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు వేములూరి కార్తీక్ భారత అండర్-18 వాలీబాల్ జట్టులో స్థానం సంపాదించి మండలానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. తాడిపూడి మహాలక్ష్మిపేటకు చెందిన వేములూరి విజయ్, గౌతమి దంపతుల కుమారుడైన కార్తీక్ తన కఠోర శ్రమ, అంకితభావం, క్రమశిక్షణతో ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
టీం లీడర్ మార్గదర్శకత్వం, కోచ్ల శిక్షణ, సహచర క్రీడాకారుల సమిష్టి కృషితో భారత జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్, 2026 ఏవీఎస్ అండర్-18 వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జెర్సీ ధరించి చైనాలో ప్రాతినిధ్యం వహించనున్నాడు.
గుండెలపై త్రివర్ణ పతాకాన్ని ధరించి అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని చాటేందుకు సిద్ధమవుతున్న కార్తీక్కు గ్రామ ప్రజలు, స్నేహితులు, బంధువులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయంతో స్వగ్రామానికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
“ఆల్ ది బెస్ట్ కార్తీక్… దేశానికి, రాష్ట్రానికి, తాడిపూడి గ్రామానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు.”


