ఖమ్మం నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థల నిలువు దోపిడీ*
*చదువు మూరేడు… ఫీజులు బారెడు
ఖమ్మంజిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ మే 04
ఖమ్మం జిల్లా:
ఖమ్మం :
( *ప్రత్యేక కథనం):*
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోబోతుండడంతో ఖమ్మం నగరంలో విద్యావ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లబోతోంది. వీధి వీధికో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న తరుణంలో.విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తున్న యాజమాన్యాలు.. ఆచరణలో మాత్రం వాటిని గాలికి వదిలేస్తున్నాయి. ‘చదువు మూరేడు… ఫీజులు బారెడు’ అన్న చందంగా తయారైంది నగరంలోని ప్రైవేటు విద్యా వ్యవస్థ తీరు. విద్యాహక్కు చట్టం నిబంధనలను తుంగలో తొక్కుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది…..
ఫీజుల మోత.. తల్లిదండ్రుల గుండెకోత….
ఎల్.కె.జి (ఎల్ కె జి) అక్షరాభ్యాసం మొదలుకొని పదవ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులు చూస్తే సామాన్యుల గుండె గుబేల్ అనక మానదు.ట్యూషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, కంప్యూటర్ ఫీజు.. ఇలా రకరకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ముక్కుపిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.తీసుకుంటున్న ఫీజులకు పక్కాగా రసీదులు కూడా ఇవ్వని పాఠశాలలు కోకొల్లలు. ఫీజులు కట్టకపోతే విద్యార్థులను తరగతి గదిలో అవమానించడం, పరీక్షలు రాయనివ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. అంతే కాకుండా చదువు చెప్పాల్సిన పాఠశాలలు షాపింగ్ మాల్స్గా మారాయి.బయట మార్కెట్లో కేవలం వందల రూపాయల్లో లభించే నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు , స్కూల్ యూనిఫాం, షూస్, బెల్టులు, టైలు కచ్చితంగా తమ దగ్గరే (లేదా తాము సూచించిన నిర్దిష్ట దుకాణంలోనే) కొనాలని యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నాయి.వీటిపై కనీసం రెండు నుంచి మూడు రెట్లు అదనపు ధరలు ముద్రించి వేలల్లో దోపిడీ చేస్తున్నారు. ఇది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక భారాన్ని మిగుల్చుతోంది…..
సౌకర్యాలు శూన్యం.. భద్రత గాలికి….
లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో యాజమాన్యాలు పూర్తిగా విఫలమవుతున్నాయి.గాలి, వెలుతురు సరిగ్గా ఆడని ఇరుకైన గదుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులను కుక్కి బోధిస్తున్నారు. ఆటస్థలాలు లేని పాఠశాలలే నగరంలో అధికం. నిబంధనలకు విరుద్ధంగా ఇరుకైన సందుల్లో, బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అత్యధిక పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత) అనుమతులు లేవు. ఏ ప్రమాదమైనా జరిగితే విద్యార్థులు బయటకు వచ్చేందుకు కనీసం అత్యవసర ద్వారాలు కూడా లేకపోవడం గమనార్హం….
ఫిట్నెస్ లేని బస్సులతో పిల్లల ప్రాణాలతో చెలగాటం..
విద్యార్థుల రవాణా విషయంలో ప్రైవేట్ స్కూల్స్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరంగా ఉంది.ఆర్టీఓ నిబంధనలను పాటించకుండా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని కాలం చెల్లిన బస్సులను విద్యార్థులను తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఆటోలు, మ్యాజిక్ వాహనాలు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను కుక్కి తీసుకెళ్తున్నారు. కనీసం అనుభవం ఉన్న డ్రైవర్లను, అటెండర్లను కూడా నియమించకపోవడంతో విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ రవాణా శాఖ అధికారుల తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల పలుకుబడికి, ముడుపులకు తలొగ్గి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అధిక ఫీజుల వసూళ్లపై కటిన చర్యలు తీసుకోవాలి…..
ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఖమ్మం నగరంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అదే విధంగా ఫీజుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.ఫైర్ సేఫ్టీ, బస్సుల ఫిట్నెస్ లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని పుస్తకాలు, యూనిఫాంల పేరుతో చేస్తున్న వ్యాపారాన్ని అడ్డుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు,విద్య అనేది వ్యాపారం కాదు, అదొక సామాజిక బాధ్యత. ఈ విషయాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు గుర్తించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పుడే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు


