కైకలూరు జూన్ 4:*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రతులను రోడ్డుపై తగలబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:
ఎన్నికల సమయంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఎందుకు విస్మరించిందో సమాధానం చెప్పాలి
ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం మహిళలను వంచించడమే.
50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామన్న వాగ్దానం ఏమైంది?
కూటమి ప్రభుత్వం కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే నెరవేర్చాలని దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.



