భద్రాచలం: పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు నిలిచిన వారే నిజమైన కమ్యూనిస్టులని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్లో గురువారం అమరజీవి టీవీఆర్ చంద్రం జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు జగన్ రచించిన ‘ఎగరేసిన ఎర్రజెండా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి.వెంకట్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీల చీలిక అనంతరం టీవీఆర్ చంద్రం సీపీఐ(ఎం) పక్షాన నిబద్ధతతో నిలిచారని, భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ తొలి శాఖ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అమరవీరులు, ఉద్యమ నాయకుల జీవిత చరిత్రలను పుస్తకాల రూపంలో నేటితరానికి అందించడం అభినందనీయమన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల కోసం త్యాగాలు చేసిన అమరవీరుల చరిత్రను దాచలేరన్నారు. భద్రాచలం ప్రాంతంలో బండారు చందర్రావు, టీవీఆర్ చంద్రం, ఎలమంచి సీతారామయ్య, బీఎస్ రామయ్యలు పార్టీ నిర్మాణానికి నాలుగు స్తంభాలుగా నిలిచారని తెలిపారు. జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, టీవీఆర్ చంద్రం కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



