మంచినీరు నుంచి విద్యుత్ వరకు.. మంగమరిపేట బహుళార్ధసాధక భవనం.. RK బీచ్–తోట్లకొండ బస్సు సర్వీసు కోసం డిమాండ్
విశాఖపట్నం జిల్లా, భీమిలి (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 18 ::
వార్డు 4 అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దూడ రమేష్, గరికిన దిలీప్ కుమార్ గౌరవ భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి PGRS ద్వారా వినతిపత్రం సమర్పించారు.
వార్డులోని మంగమరిపేట, తిమ్మాపురం, గంగడపాలెం శ్మశాన వాటికల వద్ద నూతన బోరు బావులు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మంగమరిపేటలో బహుళార్ధసాధక భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
RK బీచ్ నుంచి తోట్లకొండ వరకు బస్సు సర్వీసు కావాలి!
పర్యాటకాభివృద్ధితో పాటు విద్యార్థులు, స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేలా RK బీచ్–బోయేపాలెం–తోట్లకొండ మార్గంలో నూతన బస్సు సర్వీసు ప్రారంభించాలని కోరారు. ఈ సర్వీసుతో మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
“ప్రజా సమస్యలే ప్రాధాన్యం.. అభివృద్ధే మా లక్ష్యం”
గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వార్డు 4 అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు త్వరితగతిన అందేలా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని దూడ రమేష్, గరికిన దిలీప్ కుమార్ తెలిపారు.




