నందిగామ: సీఎం సహాయనిధి కేవలం ఆర్థిక సహాయం కాదని.. ఆపదలో ఉన్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం అందించే భరోసా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం, వారి కన్నీళ్లు తుడవడం, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ భవన్లో శుక్రవారం కూటమి నేతలతో కలిసి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.64,19,305 విలువైన చెక్కులను 106 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేరుగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు. అనారోగ్యం, వైద్య ఖర్చులు తదితర అనుకోని పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని తెలిపారు.
ప్రజల కష్టాలను తెలుసుకుని, వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని సౌమ్య స్పష్టం చేశారు. నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తన వంతు సహకారం అందిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అర్హతను ప్రామాణికంగా తీసుకుని పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందిస్తోందని కూటమి నేతలు పేర్కొన్నారు. సీఎం సహాయనిధి ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



