మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 8న మంథని రూరల్, మంథని అర్బన్, ముత్తారం, రామగిరి ఎస్జీఎఫ్ (SGF) జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్ను ఘనంగా ప్రారంబించగా, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. “గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం – క్రీడల ద్వారా ప్రతిభకు ప్రోత్సాహం” అనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, నిర్వాహకులను ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, పీఈటి దొమ్మటి రవి, కొమురోజు శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

