తల్లాడ/ ఖమ్మం
రైతులు, పేదలు, ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని భాజపా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు ఆపద వెంకట రామారావు డిమాండ్ చేశారు. సోమవారం తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతులు, బాధితులతో కలిసి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆపద వెంకట రామారావు మాట్లాడుతూ అన్నారుగూడెం గ్రామంలోని నిరుపేదలకు వెంటనే పక్కా ఇళ్లు మంజూరు చేయాలని, అన్నారుగూడెం క్లస్టర్కు శాశ్వత ఏఈఓను నియమించాలని కోరారు. సిరిపురం మేజర్ కాలువకు సీతారామ ప్రాజెక్టు ద్వారా తక్షణమే సాగునీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
సీతారామ ప్రాజెక్టు అనుసంధానంలో కాలువ వెడల్పు కారణంగా భూములు, పంటలు నష్టపోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. కాలువ గ్రామం మధ్య నుంచి వెళ్లడంతో ఇబ్బందులు పడుతున్న ఎస్సీ కాలనీ ప్రజలకు పక్కా ఇళ్లు మంజూరు చేసి పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలను పరిష్కరించకపోతే భాజపా ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆపద వెంకట రామారావు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలు, బాధితులు పాల్గొన్నారు.



