ఖమ్మం, జులై.
(పున్నమి ప్రతినిధి)
వీఎం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దేవాలయాల చోరీల కేసును పోలీసులు ఛేదించి, గత కొంతకాలంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, Cr.No.123/2026లో షేక్ జానీ @ జానీ షరీఫ్, పేరాల నరసింహారావు @ బాబీ, అర్వ ఉదయ్ కుమార్లను జూలై 19 సాయంత్రం సీతారామపురం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కారు, మోటార్ సైకిల్పై దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను తిరువూరులో విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుకుని, పంచుల సమక్షంలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు.
పోలీసులు వారి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.536 కిలోల వెండి వస్తువులు, నేరాలకు ఉపయోగించిన ఒక కారు, ఒక మోటార్ సైకిల్, అలాగే ఇనుప రాడ్, సుత్తి, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్లు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం, డెకాయిటీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. షేక్ జానీపై కొత్తగూడెం టూ టౌన్, పాల్వంచ, ఇల్లందు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉండగా, పేరాల నరసింహారావుపై హైదరాబాద్ ఎల్బీనగర్తో పాటు ములకలపల్లి, నేలకొండపల్లి, గోకవరం పోలీస్ స్టేషన్లలో దేవాలయ చోరీ కేసులు నమోదయ్యాయి. అర్వ ఉదయ్ కుమార్పై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో డెకాయిటీ కేసు ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మండలంలోని దేవాలయాల కమిటీలకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు.



