-చిట్వేలి పోలీస్ స్టేషన్లో రేణిగుంట డీఎస్పీ క్రైమ్ మీటింగ్
-పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఆదేశాలు
-బాధితులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సూచన
పాల్గొన్న కోడూరు రూరల్ సీఐ, పలువురు ఎస్ఐలు
పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు మర్యాదపూర్వకంగా సేవలు అందిస్తూ, వారికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని రేణిగుంట డివిజన్ డీఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం (జూలై 17) చిట్వేలి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లె, చిట్వేలి పోలీస్ స్టేషన్ల సబ్-ఇన్స్పెక్టర్లు (ఎస్ఐలు) హాజరయ్యారు.
-పెండింగ్ కేసులపై ఆరా..
ఈ సందర్భంగా డీఎస్పీ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్షించారు. శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
-ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఆదేశాలు..
రాబోయే ఎన్నికల దృష్ట్యా డీఎస్పీ అధికారులకు పలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించి స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం సేకరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న సమస్యాత్మక వ్యక్తులను (ముందుగానే గుర్తించి, వారిపై అవసరమైన బైండోవర్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
-అప్రమత్తంగా వ్యవహరించాలి..
గ్రామాల్లో చోటుచేసుకునే ముఖ్యమైన పరిణామాలు, వివాదాలు, రాజకీయ పరిస్థితులు, ఇతర సున్నితమైన అంశాలను వెంటనే పై అధికారులకు నివేదిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, చట్టవ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పోలీసు అధికారులను హెచ్చరించారు.


