రూ.8.13 లక్షల విలువైన 16 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ఆత్మకూరు, జూలై 16 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రభుత్వం నిరంతరం సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.
గురువారం ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రూ.8.13 లక్షల విలువైన 16 సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని భరోసా కల్పించారు.
మంత్రి ఆనం మాట్లాడుతూ, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఉపశమనం లభిస్తోందని చెప్పారు.
ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని, అవసరమైన చోట మరింత సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


