తాళ్లపూడి, జూలై 10 (పున్నమి ప్రతినిధి):
వేగేశ్వరపురం, తిరుగుడుమెట్ట సమస్యలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు వినతి
తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘జనతా వారిది’ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తాళ్లపూడి మండలం తరఫున మండల బీజేపీ అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ, నాయకులు పామర్తి పవన్ కుమార్లు మండలంలోని పలు గ్రామాల సమస్యలపై సమగ్ర నివేదికను ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అందజేశారు.
వేగేశ్వరపురం గ్రామంలోని డంపింగ్ యార్డు, డ్రైనేజీ సమస్యలు, తిరుగుడుమెట్ట గ్రామంలో కొవ్వాడ కాలువపై వంతెన నిర్మాణం, సీసీ రోడ్డు ఏర్పాటు, బస్సు సౌకర్యం కల్పించాలనే డిమాండ్లను నివేదికలో పొందుపరిచారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీని కోరినట్లు వారు తెలిపారు.

