విజయవాడ : పున్నమి ప్రతినిధి సురేష్
శుక్రవారం 29వ డివిజన్ నేతాజీ రోడ్, మధురానగర్లోని చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో గోగా కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన సిపిఐ పార్టీ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు లంకా గోవిందరాజులు మాట్లాడుతూ, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎంపీని ప్రజలు ఎంతో నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపిస్తే, నేడు నగర ప్రజల ఆకాంక్షలను వారు తుంగలో తొక్కుతున్నారు అని విమర్శించారు. ఇప్పుడున్న విజయవాడను ‘గ్రేటర్ విజయవాడ’గా మారుస్తామని పాలకులు దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమయ్యారు. దీనికి అధికారికంగా చట్టబద్ధత కల్పించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రేటర్ హోదా లేకపోవడం వల్ల కేంద్రం నుండి వచ్చే భారీ నిధులను నగరం కోల్పోతోందని, తక్షణమే చట్టబద్ధత కల్పించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి అభివృద్ధిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే, రాజధాని ప్రాంతానికి వేల కోట్లు కేటాయిస్తూ, దానికి ప్రధాన కేంద్రమైన విజయవాడను విస్మరించడం ఎంతవరకు సమంజసం? కేంద్రం ఇచ్చే నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి, విజయవాడకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నగర నిధుల కోసం ఎందుకు గొంతు ఎత్తడం లేదని నిలదీశారు.
2024లో బుడమేరు వరదలు నగర ప్రజలను నిలువునా ముంచాయి. మళ్లీ వర్షాకాలం సమీపిస్తున్నా, ముంపు నివారణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు.
29వ డివిజన్ కార్యదర్శి యాదల శివ మాట్లాడుతూ, నగరంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు.
విజయవాడ నగరం తన ప్రాశస్త్యాన్ని కోల్పోకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, తక్షణమే అభివృద్ధి నిధులు విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది.
లేనిపక్షంలో ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని
లంకా గోవిందరాజులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సిపిఐ డివిజన్ సహాయ కార్యదర్శులు ఎస్.కె. సుభాని, గోగా నవీన్, కమిటీ సభ్యులు ఎస్.కె. షాదిక్, నివగాని కుమార్, ఒంగోలు రాజు, యారాబటి జగదీష్, పి. శ్రీనివాసరావు, సగ్గుర్తి రామకృష్ణ, మణెమ్మ, భారతి, లక్ష్మి, సుంకర దుర్గ, సింహాచలం మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


