ఖమ్మం ఏప్రిల్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )
అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలేకు సమానత్వ సమాజ నిర్మాణమే నిజమైన నివాళి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండల పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు పరిమితమని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరియు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.
ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.58.95 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే వరంగల్ క్రాస్ రోడ్ ఆటోనగర్ నుంచి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు రూ.4.50 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు భూమిపూజ నిర్వహించారు.
ఖమ్మం రూరల్ మండల అభివృద్ధి కోసం గత 27 నెలల్లో రూ.64.92 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచినట్లు వివరించారు.
మంగళగూడెం గ్రామంలో కొత్తూరు నుంచి కాచిరాజుగూడెం వరకు రూ.2.50 కోట్లతో చేపట్టనున్న రోడ్డు మరియు స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 227 మందికి రూ.70.42 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



