
చింతలపూడి మండలంలోని వీరభద్ర పేట గ్రామ గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 కుటుంబాలు నివసించే ఈ గ్రామంలో ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేశారు. అయితే, రోడ్డు పనుల కారణంగా గ్రామానికి నీటిని అందించే మెయిన్ పైప్ లైన్ కట్ అయిపోవడంతో త్రాగునీరు సరఫరా ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో గ్రామస్తులు బిందెలతో దూరంలో ఉన్న నీటి ట్యాంకు వద్దకు వెళ్లి త్రాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. “జల్జీవన్ మిషన్ కింద ఇంటింటికి ఇచ్చిన కొళాయిలకు నీరు రాకపోవడం వల్ల వాటి ఉపయోగమే లేకుండా పోయింది” అని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.టి. దొర ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీకి, మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమస్యను తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని ఆరోపించారు. పైప్ లైన్ వెంటనే రిపేర్ చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వస్తుందని గిరిజన సంఘ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జరత ఈశ్వరరావు, తామర్ల బుచ్చిబాబు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

