తిరుమల : పున్నమి ప్రతినిధి సురేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు సోమవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా ఎదగాలని ప్రార్థించినట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అందరిపై దేవుని కటాక్షం మెండుగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవ చేసే అవకాశం కలగాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యానికి దైవ బలం తోడుగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం తిరుచానూరు పద్మావతిదేవి ని దర్శించుకున్నారు.



